❇ సమూయేలు యెష్షయిని, అతని కుమారులను పవిత్ర పరచి, బలి అర్పణలో పాలుపుచ్చుకోమని వారిని ఆహ్వానించాడు.యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసి౼“నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలచాడు.
అయితే యెహోవా సమూయేలుతో౼“అతడి ఎత్తునూ ఆకారాన్నీ లక్ష్యపెట్టవద్దు. ఎందుకంటే నేను అతణ్ణి నిరాకరించాను. దేవుడు మనిషిలాగా చూడడు. మనుషులు బయటి ఆకారాన్ని చూస్తారు గాని యెహోవా హృదయంతరంగాన్ని చూస్తాడు” అన్నాడు....
యెష్షయి తన కొడుకులలో ఏడుగురిని సమూయేలు ముందుకు రప్పించాడు గాని సమూయేలు “యెహోవా వీళ్ళను ఎన్నుకోలేదు! నీ కొడుకులందరూ ఇక్కడున్నారా?” అని యెష్షయిని అడిగాడు.
యెష్షయి౼“అందరికన్న చిన్నవాడున్నాడు. కానీ వాడు గొర్రెలు మేపుతున్నాడు”. సమూయేలు౼“అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా! అతడొచ్చే వరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు. కనుక యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి రప్పించాడు...
యెహోవా సమూయేలుతో౼“లేచి ఇతణ్ణి అభిషేకించు! నేను ఎన్నుకొన్నవాడు ఇతడే!”అని చెప్పాడు. సమూయేలు నూనెతో నిండిన కొమ్మును తీసి అతడి అన్నల సమక్షంలో అతణ్ణి అభిషేకం చేశాడు ❇
■ యెష్షయి దృష్టిలో దావీదు గొఱ్ఱెలకు మంచి కాపరి మాత్రమే!అతని కంటే గొప్ప దేహదారుఢ్యం గల పెద్దవారైన అన్నలు ఉన్నారు గనుక దావీదు ఇక అవసరం లేదని(లేక సరిపోడని) అతని అభిప్రాయం కావొచ్చు. ఇక్కడ దేవుడు తన ప్రవక్తయైన సమూయేలుకు కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు. ఎత్తు, రూపం దేవుని చేత వాడబడటానికి అర్హతలు కావు. అప్పటికే సౌలు విషయంలో అది నిరూపించబడింది. దేవుడు దావీదును చేసిన ఎంపిక అప్పటికప్పుడు జరిగిన నిర్ణయం కాదు. అది దేవునితో అతని ప్రయాణాన్ని బట్టి కలిగింది. దేవుడు అనేక విధాలుగా అతని విశ్వాసాన్ని, అప్పగించబడిన దాని విషయంలో కనబర్చిన శ్రద్ధను, అతని త్యాగాన్ని, దేవునితో అంటుకట్టబడి, ఆయన్ను ఆధారం చేసుకున్న జీవితాన్ని చూశాడు.. ఇలా దావీదు దేవుణ్ని ఆధారం చేసుకొన్న విశ్వాస వీరునిగా-యోధునిగా దేవుని ముందు కనబడ్డాడు. సైన్యంలో కాదు! అరణ్యంలో గొర్రెల సంరక్షణలో!మందకు నమ్మకమైన కాపరిగా, ఎవ్వరూ చూడనప్పుడు దేవుని యెదుట ఆరాధికునిగా కనబడ్డాడు. దేవుడు గొప్ప విషయాల్లోనే ఉంటాడని అనుకోవద్దు.. మనుష్యులకు అతి స్వల్పంగా కనిపించే విషయాల్లోనూ అతి సమీపంగా ఉంటాడు.
■ ఒకవేళ ముందే అక్కడ దావీదు వారితో ఉన్నట్లేతే సమూయేలు సైతం దావీదును అభిషక్తునిగా ఉహించకపోవచ్చు! దావీదు ఇంటివారికి కూడా దావీదు మీద మంచి అభిప్రాయం లేదు(1సమూ 17:28)! కానీ దేవుని చూపు మునుష్యల చూపు కంటే విభిన్నమైనది. మొదట మనుష్యుల అభిప్రాయం అనే సంకేళ్ళ నుండి విడుదల చెయ్యబడాలి.దేవుని ఆత్మ మరియు దేవునితో నడిచే ప్రజల గద్దింపులకు మాత్రమే చెవి ఇవ్వాలి. అవి మన మేలుకోరి పలుకబడే మాటలు. విమర్శించే, నిందించే మాటలుగా ఉండవు. దావీదు దేవుని సముఖంలో, దేవుణ్ని ఆధారం చేసుకుని జీవించే వ్యక్తి. మనుష్యులు దేవుని సంబంధిని గుర్తుపట్టలేకపోవచ్చు గాని, దేవుడు తన వారిని గుర్తుపడతాడు. నీవు చిన్న చూపు చూడబడ్తున్నావని భాధపడుతున్నావా? నీకొక నిరీక్షణ మాటలు చెప్పనివ్వు!నీ విలువ దేవుని మనస్సులో ఉంటుంది..కానీ మనుష్యుల అభిప్రాయాలలో కాదు.నీవు దేవుని సముఖంలో జీవించే వ్యక్తివైతే, నీ విశ్వాసం దేవునిలో లోతుగా పాతుకపోనివ్వు!దేవుణ్ని బట్టి నిమ్మళంగా ఉండు! ఒక సమయం వస్తుంది..మనుష్యుల అభిప్రాయ కంచెను దేవుడే తీసివేస్తాడు..దానికి ఎదురు నిలవటం ఏ నరునికి సాధ్యపడదు.
౼ దావీదులో ఒక గొర్రెల కాపరిని వారు మాత్రమే చేశారు, కానీ దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప రాజును దేవుడు చూశాడు.ఇశ్రాయేలు చరిత్రలో దావీదు వంటి రాజు మరెవ్వరూ లేరు. నిన్ను గురించి నీ సృష్టికర్తకు గాక మరెవరకు సంపూర్ణంగా తెలియదు. కనుక కృంగిపోకు(మీకా 5:2)! దేవుని దృష్టిలో నీ విలువ ప్రత్యేకమైనది. మన ప్రాణాత్మలు సేద తీరడానికి దేవుని సన్నిధి అనువైన చోటు!
Comments
Post a Comment