✴️ చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి బాప్తిస్మమిచ్చు యోహాను౼“సర్పసంతానమా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు..‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను"(మత్తయి 3:7,9)
అందుకు యేసు జక్కయ్యతో౼“ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే" (లూకా 19:9)
ఆ నిరుపేదైన లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు (లూకా 16:22) ✴️
■ అబ్రాహాము విశ్వాసంతో దేవునితో కూడా నడచినవాడు. దేవునికి స్నేహితుడిని లేఖనాల్లో అతనికి పేరు ఉంది. ఆయన వద్దకు దిగి వచ్చిన దేవదూతలను (దేవుణ్ని), దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. తన బలహీనతల నుండి బలమైన విశ్వాసిగా మార్పు చెందిన విశ్వాస వీరుడు. శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు తాము 'అబ్రాహాము సంతాన'మని, ఏర్పరచబడిన జనాంగమని ఉప్పొంగుతూ ఉన్నారు. ఐతే బాప్తిస్మమిచ్చు యోహాను వారిని సర్పసంతానమా అని పిలిచాడు (దేవుని అభిప్రాయం కూడా అదే). బహుశా! అంతకు ముందు ఎవ్వరూ వారిని ఆ పేరుతో పిలిచివుండరు. ఆ తర్వాత క్రీస్తు కూడా వారిని అలాగే పిలిచాడు (మత్త 12:34).
■ కానీ అన్యాయస్తుడు, లంచగొండియైన జక్కయ్యను ప్రభువు అబ్రాహాము కుమారునిగా పిలిచాడు. బీదవాడు, రోగియైన లాజరు చనిపోయి అబ్రాహాముకు సమీపంగా ఉన్నట్లు ఆయన చెప్పాడు. దేవుడు మనకు ఏమి చెపుతున్నాడు? ఎవరైతే దేవుడు పిలువగా తమ హృదయాన్ని కఠిన పర్చుకోక, తమ చెడు మార్గాలను విడిచి, విశ్వాసంతో దేవుని పక్షం చేరతారో వారంతా అబ్రాహాము సంతానమే! అబ్రాహాము వలె గొప్ప విశ్వాసాలను రుజువు పర్చకపోవచ్చును గాని అబ్రాహాము నడచిన మార్గంలో కాలు మోపి-నడిచేవారిగా ఉంటే చాలు. లాజరు తన కటిక బీదరికంలో దేవుణ్ని దూషించక, నమ్మకంగా సేవించాడు. జక్కయ్య అన్యాయపు సిరి, భోగభాగ్యాల కంటే దేవుణ్ని హత్తుకోవడమే ఘనంగా భావించి అంతా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది అబ్రాహాము నడచిన మార్గం. నీవు ఈ మార్గంలో నడుస్తున్న వ్యక్తివైతే నీవు అబ్రాహాము కుమారుడవే! మరణానంతరం అబ్రాహామును దగ్గర నుండి చూస్తావు.
■ అబ్రాహామును పోలిన జీవితాలు లేకుండా ఆయన స్వతంత్రించుకున్న వాగ్దానాల్లో పాలినవారుగా ఉంటామని భావించి, అతిసయపడటం మూర్ఖత్వమే! గొప్పదైవజనులతో సాన్నిహిత్యం, వారిపై వల్లబారిన అభిమానం నీ భక్తిజీవితాన్ని సూచించదు. వారి వలె నడవకుండా అతిసయిస్తూ మిగితా వారిని చులకనగా చూస్తుంటే గనుక అది పరిసయ్యుని భక్తే! శాస్త్రులు, పరిసయ్యులు గాని అబ్రాహాము కాలంలో జీవించినట్లతే వారు అతణ్ని దైవజనుడిగా చూడరు గాని ద్వేషించివుండేవారు. ఎందుకంటే అబ్రాహాము కంటే గొప్పవాడైన క్రీస్తుతో వారు అలాగే ప్రవర్తించాడు. ప్రతి తరంలో ఇలాగే జరుగుతుంది. వారి తరానికి ముందున్న భక్తిపరులను౼దైవజనులుగా అంగీకరిస్తారు(కానీ వారి వలె నడవరు), వారిని హింసించిన వారిని కూడా ద్వేషిస్తారు! మేము అలా చేయము అనుకుంటారు. కాని తమ తరంలో౼ నీతిమంతులను ద్వేషిస్తారు, తమలాంటి (పరిసయ) గుంపును హత్తుకుంటారు. స్వపరీక్ష చేసుకో! అబ్రాహాము వంటి జీవితాన్ని కోరుకుంటూన్నావా? లేక వ్యర్ధాతిశయాల దగ్గరే ఆగిపోయావా?
Comments
Post a Comment