
'ఓ యూదా ప్రజలారా! దేవుని మాట ఆలకించండి! దేవుణ్ని ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం గుండా వచ్చే ప్రజలారా ఈ వర్తమానం వినండి... సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు. మీ జీవన విధానాన్ని మార్చుకోండి. అప్పుడే నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను. మోసపు మాటలను నమ్ముకొని "ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం!" అనొద్దు...!
అయితే మీరు పనికిమాలిన మోసపు మాటలు నమ్ముతున్నారు. మీరు దొంగతనం, హత్య, వ్యభిచారం చేస్తూ, ప్రమాణం చేసి అబద్ధం చెపుతూ, విగ్రహాలకు ధూపం వేస్తూ, మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, మీరీ పాపాలు చేసి..నా పేరున్న ఈ ఆలయానికి వచ్చి, నా ఎదుట నిలబడి, 'అపాయంనుంచి తప్పించుకొన్నాం' అంటారేం? మీరు విడుదల పొందినది ఈ అసహ్య కార్యాలను చేయడానికేనా? నా పేరున్న ఈ ఆలయం మీ దృష్టికి దొంగల గుహగా అయిందా?నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!'"(యిర్మీయా7:1-11)

■ మన జీవితం పట్ల దేవుని అభిప్రాయం ఎలావుందో, ఆసక్తిపరులమై మనస్సు పెట్టి తెలుసుకోనంత వరకు మనం పాపపు భ్రమలోనే బ్రతుకుతాము. ఇక్కడ వీరి విషయంలో దేవుడు అసంతృప్తిగా ఉన్నాడు. వారి వ్యక్తిగత జీవితాలకు అవసరమయ్యే ప్రవచనాత్మకమైన మాట వారి హృదయాలను తాకుతుంది(మత్త 3:7). మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్తమే దేవుని వాక్కని దృఢంగా నమ్ముతున్నారు, కానీ ప్రస్తుతం దేవుడు వారి జీవితాలకిచ్చిన(అవసరమైన) ప్రవచనాత్మకమైన మాట మాత్రం మనిషిదే(యిర్మీయాదే) గానీ దేవునిది కాదనేది వారి అభిప్రాయం!నాడు ఆ ప్రజల చేసిన తప్పిదమే, ప్రతి తరంలో జరుగుతుంది. దైవికమైన వాక్కును, దైవికమైన వ్యక్తులను తిరస్కరించే వారి సంతానం వారత్వపు సంతతిగా ప్రతి తరంలోనూ ఉన్నారు. ఎవరైతే దైవిక ప్రజలను తిరస్కరిస్తారో వారు బయటికి దేవుని వాక్కును అంగీకరిస్తున్న వారిగా కనిపిస్తున్నా, వారి రహస్యంగా జీవితాల్లో ఆయన వాక్కును తిరస్కరిస్తున్నవారే అనేది స్పష్టము!
■ నిష్కల్మషమైన-నిర్మలమైన ధర్మశాస్త్రపు వాక్కులు, పితరులు కట్టిన ఆలయం-దాని చారిత్రాత్మక గొప్పతనం,వారి జాతే వారికి అతిశయాలుగా మిగిలిపోయాయి ఆచారాలుగా బలులు, మ్రొక్కుబడిగా పండుగలు ఆచరిస్తూ..తమ పాపపు జీవితం ఏ మాత్రం విడవకుండా(దైవ భయం లేకుండా), దేవుని ఆలయానికి వస్తున్నారు. తన సహవాసానికి, మహిమకు పిలుచుకున్న దేవునికి తగినట్లుగా జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడలేదు. వాక్యంలో ఉన్న విలువైన విషయాలను బుద్ధిపూర్వకంగా వదిలి వేస్తూ, మతసంబంధమైన భక్తికి తిరిగారు. శ్రేష్టమైన దేవుని వాక్కులు తమతో ఉన్నాయని,దేవుని సన్నిధి తమతో ఉందని, ఇక ఎన్నటికీ తాము కదల్చబడమనే భ్రమలో వారున్నారు. ఆలయం భక్తిహీనులంతా కలుసుకునే దొంగల గుహలాగా మారిపోయింది(అపో 17:5, లూకా 19:46). తుదకు వారు దేవున్నుండి పొందుకున్న ఆ హెచ్చరిక ప్రకారం సురక్షితం అనుకున్న ప్రదేశం నుండి చెరపట్ట బడ్డారు, ఆలయం బబులోను చేత పడగొట్టబడింది(యిర్మీ 52)
■ ఈ క్రొత్తనిభంధనలో దేవుని ఆలయం మన దేహాలే! పాపపు బానిసత్వం నుండి క్రీస్తు మనల్ని విమోచించాడు.అర్హత లేని మనల్ని తన పరిశుద్ధ సహవాసంలోకి, మహిమలోకి పిలిచిన దేవునికి తగినట్లుగా మనం జీవించాలని కోరుతున్నాడు(1 థెస్స 2:11). తండ్రియైన దేవుడు మన కొరకు క్రీస్తులో కృపను సిద్ధం చేసి, ఆయనలో నిలిచి ఫలించాలని ఆదేశిస్తున్నాడు. ఆయన ఆత్మను మనలో జీవింప జేయటం ద్వారా, ఈ మంటి ఘటాలను దేవుని మహిమతో నింపాడు. ఐతే ఒకడు దేవుని పరిశుద్ధత నుండి మరలి, ఒకప్పుడు ఏ పాపాలను ద్వేషించి రక్షకుణ్ని ఆశ్రయించామో అదే క్రియలను మరలా రహస్యంగా తిరిగి(మతాసక్తి గల వారుగా మిగిలి), క్రీస్తు నుండి వేరుండకోరిన వారిగా ఉంటూ,'నేను సురక్షితం, నేను సురక్షితం' అనుకున్నట్లైతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే(ప్రకటన 3:16)! దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ని పాడుజేస్తాడు. నీ భక్తి పాపం నుండి, లోకం నుండి నిన్ను వేరు చేస్తుందా? దేవుని పవిత్రత వైపు నడిపిస్తుందా? మన అవయవాలను దుర్నీతికి కాక నీతిసాధనాలుగా దేవునికి అప్పగించుకొందాం! (రోమా 6:12,13).
Comments
Post a Comment