❇ అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ ధూపార్తులను చేతపట్టుకొని వాటిలో నిప్పు ఉంచి ధూప ద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరే నిప్పు. ఈ విధంగా వారు పాపం చేసారు కనుక యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. అలాగే వారు యెహోవా సన్నిధానంలో చనిపోయారు.
అప్పుడు మోషే అహరోనుతో౼“యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు,’నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి'”. అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు.
అప్పుడు అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులను మోషే పిలిపించాడు. వారు మీషాయేలును ఎల్సాఫానును. అతడు వారితో౼“పరిశుద్ధ స్థలం ముందుకు వెళ్లండి. మీ సోదరుల శవాలను పాళెము వెలుపలకు తీసుకొని పొండి” అన్నాడు. అప్పుడు వారు నాదాబు, అబీహు శవాలను పాళెము వెలుపలకు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.(లేవీ 10:1-5) ❇
■ ధర్మశాస్త్రంలో అదేశించబడిన పనులు రాబోయే క్రీస్తు విమోచన కార్యానికి ముంగుర్తులు. ఎక్కడ దేవుని ప్రత్యక్షత (revelation) ఎక్కువగా ఉంటుందో అక్కడ విధేయత ఎక్కువగా ఎదురు చూడబడుతుంది.నిజానికి ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారం ఆవరణంలో ఉన్న బలిపీఠం నిప్పుతోనే ధూపం వేయాలని దేవుడు ఆదేశించాడు(లేవి 16:12). 'బలిపీఠం'౼మానవాళి అంతటి పాప-ప్రక్షాళన నిమిత్తం క్రీస్తు చేసిన బలియాగాయానికి గుర్తు. నిప్పు పాపాన్ని శుద్ధపర్చే క్రీస్తు రక్తానికి గుర్తు(యెషయా 6:6,7;1యోహా 1:7). అలా వేయబడిన (ఆరాధన/ప్రార్ధన)దూపమే దేవునికి అంగీకార యోగ్యమైనది. ఇది యాజకులకు స్పష్టమైన దేవుని ఆజ్ఞ(నిర్గ 30:7-9)! కానీ నాదాబు, అబీహులు దేవుని ఆజ్ఞను మాటలను చులకనగా చూశారు. దేవుడు అనేక మార్లు ఒక వ్యక్తి మారడానికి అవకాశాలు ఇస్తాడు. దేవుని మాటలను చులకనగా తీసుకొనే స్వభావాన్ని విడువక నిర్లక్ష్యన్ని చూపించే వారిపై దేవుని ఉగ్రత అనుకోని సమయంలో, ఊహించని రీతిలో అకస్మాత్తుగా వ్యక్తి మీదకు వస్తాయి(సామె 29:1). దేవుని సముఖంలో(ఆయన నామం పేరిట) చేసే తప్పులకు మరి త్వరగా తీర్పులోకి వస్తాయి(1కొరిధి 11:27-29, అపో 5:5). దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు. కనుక దేవునికి దగ్గరగా జీవించే వారిలో ఇలాంటి పరిశుద్ధ భయం కలిగివుండటం అవసరమే!(అపో 5:11, 2సమూ 6:7, యెషయా 6:5)
■ కృప విస్తరంగా ఉంది, క్షమాపణ సిద్ధంగా ఉందని పాపాన్ని చులకనగా తీసుకోకూడదు. దేవుని వాక్యాన్ని చూపి, పాపాన్ని సమర్ధించే భావన ఎవరు కలిగించినా, అది అపవాది దగ్గర నుండి కలిగినదే! ఆదిలో ౼'మీరు చావనే చావరు' అని అబద్ధమాడి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను చులకనగా చేసిన అబద్ధం, నేడు క్రైస్తవ లోకంలో పాపాన్ని చులకనగా చూపే 'కృప', అపవాది ఆలోచనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృప'-పాపం నుండి బయటికి రావడానికి అనుగ్రహింపబడిందే గాని పాపంలో ఆనందించడానికి కాదు.అందులో పాపంతో పోరాటం ఉంటుంది. నాదాబు, అబీహులు వారి ప్రత్యేక వస్త్రాలతోనే శిక్షించబడ్డారు. నీకు అనుగ్రహింపబడిన కృప, నీవు ప్రత్యేక పరచబడిన వాడని, నీవు జీవించవల్సిన విధానాన్ని చూపిస్తుంది. అది నీ అర్హత కానప్పుడు,నీకు మరొకని కృప చేత ఇవ్వబడిందని స్పష్టమే కదా! అప్పుడు ఇచ్చిన వానికి లెక్క అప్పజెప్పవాల్సిన బాధ్యత ఉంటుందని మర్చిపోకూడదు.నులివెచ్చని జీవితంతో దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకూడదు కానీ, హృదయాల్లో దేవుని ఆత్మ చేత వ్రాయబడిన క్రీస్తు ఆజ్ఞలను(హెబ్రీ 10:16) అనుసరించి నడచుకొనునట్లు, మనల్ని మనం దేవునికి కృపకు అప్పగించుకోవాలి.
Comments
Post a Comment