✔ దేవుణ్ని తెలుసుకోవడం అంటే వాక్యాలను, దాని మూలాలను (information), వివిధమైన పుస్తకాలను (refer చేసి) చదివి తెలుసుకోవడం కాదు. అదే నిజమైతే..చదువుకోని వారు,(ఈ లోక) జ్ఞానం లేని వారి విషయంలో దేవుడు అన్యాయస్తుడుగా ఉంటాడు. దేవుణ్ని తెలుసుకునే విధానం ఖచ్చితంగా జ్ఞాని౼అజ్ఞాని, చదువుకున్నా౼చదువు లేకున్నా, బీద౼ధనిక తేడా లేకుండా దేవుని తెల్సుకోగలిగేలా ఉండే విధానాన్నే దేవుడు ఎంచుకుంటాడు అనేది సుస్పష్టం.
అది ఎలాగంటే..మన జీవితాల్లో ఆయన స్వభావాన్ని, ఆయన ప్రమేయాన్ని దగ్గర నుండి అనుభవాల గుండా తెలుసుకోవడం.
◆ మారు మూల పల్లెటూరులోని, ఏమాత్రం చదువులేని, బైబిల్లో వాక్యాలేమీ చదవలేని ఒక ముసలివాడైన వ్యక్తి దేవుణ్ని తెల్సుకొని ఉండి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులకి దేవుణ్ని ఒక వ్యక్తిలాగా ప్రేమించడం మాత్రమే తెల్సు. దేవుణ్ని కన్న తండ్రిలాగా భావించడం తెల్సు. విన్న కొద్ది మాటలు విశ్వాసముంచి నమ్మకంగా దేవుణ్ని సేవించడం మాత్రమే వారికి తెల్సు. ఇలాంటి వారికి అత్యంత చేరువలో దేవుడు ఉంటాడు అనడంలో సందేహం లేదు.
◆ మరొక వ్యక్తి బైబిల్ యూనివర్సిటీలో పండితుడై, అక్కడ ఉన్నవారందరిలో జ్ఞానవతుడై ఉండొచ్చు కానీ దేవుణ్ని వ్యక్తిగతంగా తెల్సుకోలేకపోవచ్చు. అతనికి వాక్యం మాత్రమే తెల్సు దేవుడు తెలియదు. దానర్థం మనం ధ్యానించకూడదా!లేదు ధ్యానించాలి. ఐతే ఆ ధ్యానం..ధ్యానం దగ్గరే ఆగిపోకూడదు. నిన్ను కదిలిస్తే వాక్యం విభజించడం, దాని వెనుక చరిత్ర (background), దాని రచేత, కాలాలు మాత్రమే చెప్తున్నావా!లేక దేవునితో నీ అనుభవాలు, ఆ విషయంలో దేవుడు నీకు వ్యక్తిగతంగా నేర్పించిన పాఠాలు చెప్తున్నావా? అలా లేకునట్లేతే నీ జ్ఞానం చెత్త బుట్టలో వేయటానికి తప్ప ఎందుకూ పనికి రాదని గుర్తుంచుకో! దేవుడు లేని జ్ఞానం చివరికి అది దేవుని గూర్చియైన వ్యర్ధమే! క్రీస్తును తెల్సుకోకముందు పౌలుగా మారిన సౌలు జీవితం అదే(పరిసయ్యుని భక్తి).సౌలు అలాగే చనిపోయినట్లేతే నరకానికే వెళ్ళిఉండేవాడు. అది వ్యర్థం అని గ్రహించి మారుమనస్సు పొందాడు. నిజ జ్ఞానమైన పునరుద్దానుడైన క్రీస్తును తెల్సుకొన్నాడు. లేఖనాలను కాదు.. అందులోని క్రీస్తును అనుభవపూర్వకంగా, వ్యక్తిగతంగా.ఇదే ప్రప్రథమని లేఖనాలు చెప్తున్నాయి. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వేతకమని చెప్తున్నాయి.
✔ మనం మారుమనస్సు పొందిన వెంటనే ఎంతో సంతోషంగా, బలంగా దేవుని కోసం సాక్షిగా నిలబడ్డాము. ఎందుకో తెలుసా!
నీ వెన్నడూ తెలుసుకోలేని ఒక గొప్ప దేవుని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెల్సుకొన్నావు.అందులో బలం ఉంది. ఆనందం ఉంది. నేడు ఆయన గూర్చి అనేక సంగతులు తెలుస్తున్నా ఆ ఆనందం కరువవుతున్న కారణం ఇదే! దేవుణ్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నావు. నీతో ఉన్న గుంపును అనుసరిస్తున్నావు (fellowship), కానీ దేవుణ్ని అనుసరించడం వదిలేస్తున్నావు. ఆ గుంపు దీని విలువను గుర్తించినవారు కాదు, ఆసక్తిని చూపిస్తున్నవారు అసలే కాదు. దేవుని వైపు అడుగులు వేయమని ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను.
✔ నేడు మనం ఘనంగా ఎంచుతున్న నాయకులు దేవునితో నడిచిన వారే!వారి జీవిత చరిత్రలను ఒక్కసారి చూడండి. ప్రతి సంఘటనలో దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం ఉంటుంది. అలాంటి వారిని (నామకార్థ భక్తి) లోకం వెలివేసింది. ఒంటరిగా బలమైన విశ్వాసంతో దేవునితో నడిచారు.దేవుణ్ని వెతికే అతి కొద్దిమంది యదార్ధవంతులే వారిని హత్తుకొన్నారు. వారు దేవుణ్ని చూచి ముందుకు నడిచారు కాబట్టి మనుష్యుల అభిప్రాయాలను లక్ష్యపెట్టలేదు.కనుక ఆ నాయకత్వ ఫలాలను నేటికి మనం అనుభవిస్తున్నాము. నీ ఆసక్తి అక్షరార్ధమైన జ్ఞానము కంటే ఆ వాక్యన్ని 'అవును' అని నీ జీవితంలో రూఢి పర్చుకొని, దేవునితో నడువు. నీ క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందించే వాడివిగా ఉంటావు.ఒక రోజున సిగ్గుపడనక్కరలేని దేవుని మనిషిగా నీవుంటావు.
Comments
Post a Comment